Thousand Pillar Temple తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నడిబొడ్డున వేయి స్థంభాల గుడి ఉంది. వరంగల్ అంటేనే టక్కున గుర్తు వస్తుంది మన వేయి స్థంభాల గుడి. కాకతీయుల కీర్తి ప్రతిష్టలను ప్రపంచం నలుదిశలా చాటి చెప్పిన దేవాలయం వేయి స్థంభాల గుడి. ఈ గుడిలో వేయి స్థంభాలు ఉంటాయి. ఒక్కో స్థంభానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.
కాకతీయ పరిపాలనకు సజీవ సాక్ష్యం
11వ శతాబ్దానికి సంబంధించిన ఈ చారిత్రక దేవాలయాన్ని కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు నిర్మించాడు. రుద్రదేవుని కాలంలోనే కాకతీయ సామ్రాజ్యానికి స్వతంత్రమొచ్చింది. అప్పుడే రుద్రదేవుడు క్రీ.శ.1163 జనవరి 19న హనుమకొండలో తనపేరున రుద్రేశ్వరదేవుడిని, వాసుదేవుడిని, సూర్యదేవుడిని ప్రతిష్ఠించి ఆ త్రికూటానికి వేయిస్థంభాలతో ఉండే మండప దేవాలయాన్ని నిర్మించాడు. అదే ఇప్పుడు వేయి స్థంభాల గుడిగా పిలుస్తున్నారు. ఇక ఆలయ పోషణ కోసం రుద్రదేవుడు మద్దిచెఱువుల గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు వేయిస్థంభాల గుడి శాసనంపై రాసి ఉంది. రుద్రదేవుడు తర్వాత గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడి కాలంలో ఈ వేయి స్థంభాల గుడిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. వారు ప్రతి నిత్యం పూజలు, అర్చనలతో రుద్రేశ్వరుడిని కొలిచేవారు.
రాణి రుద్రమదేవి కూడా ఈ ఆలయంలో పూజలు, యాగాలు చేసేది. పూర్తిగా చాళుక్యుల శైలిలో నిర్మించిన ఈ ఈ దేవాలయం కాకతీయ చక్రవర్తుల కళకు నిదర్శనం. భావితరాలకు చెప్పుకోదగ్గ గిఫ్ట్ను ఇచ్చారు. వరంగల్ నడిబొడ్డున ఉన్న ఈ దేవాలయం దాదాపు 900 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ తన ప్రాభవాన్ని చాటుకుంటూనే ఉంది. కాకతీయుల శిల్పకళా శైలితో ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై సాక్షాత్తు ఆ రుద్రేశ్వరుడే లింగం రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువై ఉన్నాడు. ప్రధానాలయాన్ని అద్భుతమైన వాస్తు, శిల్పకళతో నిర్మించారు.
నందీశ్వరుడిని చూడటానికి రెండు కళ్లు చాలవు
ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖంగా ఉన్ననందీశ్వరుడిని చూస్తే ఒళ్లు జలకరిస్తుంది. ఈ నందీశ్వరుడి విగ్రహం నల్లరాతితో చెక్కబడి, చూడటానికి రెండు కళ్లు సరిపోవు. కళ్యాణ మంటపానికి, ప్రధానాలయాలకు మధ్యన ఎంతో ఠీవీగా దర్శనమిస్తున్న ఈ నందీశ్వరుడిని ఒక్కసారి తాకితే చాలు సాక్షాత్తు ఆ కైలాసంలో ఉన్న ఆ నందీశ్వరుడినే తాకినట్టే అనిపిస్తుంది. మనం ఒక్కసారి ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే లింగాలపై కరవీర చెట్టునుంచి సువాసనలు వెదజల్లుతూ పూలు పడుతున్న ఆ అపురూపమైన దృశ్యం మనల్ని కట్టిపడేస్తుంది.
ఈశాన్యం వైపు ఉన్న ఆనాటి కోనేటిని చూస్తే అక్కడి నుంచి రావడానికి మనసొప్పదు. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ కోనేరులో నీళ్లు ఉండటం దేవ నిర్ణయమే. నీటిలో విష్ణుమూర్తి అవతారామైన తాబేళ్లు జలకాలాడుతున్న దృశ్యం భక్తులను ఆకట్టుకుంటుంది.
అపురూపమైన విగ్రహాలు
ఆలయ మంటపంపై చెక్కిన విగ్రహాలు, రామయణ, మహాభారత ఇతిహాస ఘట్టాలను చూస్తుంటే అలనాటి కాకతీయుల శిల్ప కళా వైభవం మన కళ్ల ముందు ఒక్కసారిగా కనబడుతుంది.
ఆశ్ఛర్యం కలిగిస్తున్న పునర్నిర్మాణం
ఆలయం ఎదురుగా ఉన్న మండపంలో కొన్ని స్థంభాలు కదులుతున్నాయని ప్రభుత్వం పునర్నించాలని సూచించింది. కళ్యాణ మంటప నిర్మాణం కోసం పునాదుల తవ్వకం మొదలు పెట్టారు. భూమి అడుగున తవ్వగానే వెంటనే ఇసుక బయటపడింది. రెండు మీటర్ల ఇసుక తొలగించగానే అందులోంచి భారీగా నీరు బయటకు వచ్చింది. నీటిని ఎంతగా తొలగించాలని ప్రయత్నించినా ప్రవాహం మాత్రం ఆగడం లేదు. భారీ మోటార్లను ఉపయోగించి నీరు బయటకు తీసినా నీరు వస్తూనే ఉంది. అయినతే వేయి స్తంభాల గుడికి చుట్టుపక్కలా వరంగల్ నగరం విస్తృతంగా విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో నీళ్ల కోసం బోరు బావులు వేసుకోవాలంటే కనీసం 200, 300 అడుగుల దాకా డ్రిల్లింగ్ చేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడ పునాది స్థాయిలోనే నీరు బయటపడటం ఏమిటని అందరూ ఆశ్ఛర్యపోయారు. నీరు, ఇసుకతో నిర్మించిన కట్టడం ఏమిటని అందరిలో ప్రశ్న మొదలైంది. ఇంతవరకు జరిగిన చారిత్రక పరిశోధనల్లో నీరు, ఇసుక కలిసిన పునాదిపై నిర్మాణాలు చేసినట్లు ఆధారాలు లేవు. తవ్విన కొద్దీ ఇసుక, నీరు తప్ప మరే నిర్మాణ సామాగ్రి కనిపించలేదు. ఈ నీరు ఎక్కడినుంచి వస్తున్నదని మరింత తవ్వి చూస్తే ఇనుప గొట్టాలు బయటపడ్డాయి. ఈ గొట్టాల నుంచే నీరు వస్తున్నట్లు నిపుణులు కనుగొన్నారు. అయితే ఈ గొట్టాలు ఎక్కడిదాకా ఉన్నాయన్నది మాత్రం అంతుచిక్కలేదు.