సినిమాల్లో నటీనటులు పోషించే పాత్రలు చూసి మనం వారిని అలానే ఊహించుకుంటాం. పాత్రలో లీనమయ్యే వారిలో కూడా ఒక్కోసారి పాత్రల ప్రభావం అలానే ఉండిపోతుంది. కొందరు బయట తమ తీరుకు భిన్నంగా ఆయా పాత్రల్లో నటిస్తే.. మరికొందరు తెరపై భీకరంగా నటించి బయట సాత్వికంగా ఉండేవారూ ఉన్నారు. కొందరిని ఆయా పాత్రలు తమను కొత్తగా మార్చేస్తాయి. సినిమా కథలు పాత్రల ప్రభావం అటువంటిది.
చిత్తూరు నాగయ్యను సినిమాల్లో చూసి అంతే సాత్వికంగా ఉండేవారు అనుకుంటే పొరపాటే. బయట ఆయన తీరుకు భిన్నంగా ఎంతో మృదుస్వభావి పాత్రలు చేసేవారు. ఆ పాత్రల ప్రభావం ఆయనపై పడి అదే అలవాటు చేసుకున్నారు. పోతన పాత్ర చేయడం ద్వారా ఆయన రామ భక్తులైపోయారు. వేమన పాత్ర ద్వారా సాధువర్తనానికి అలవాటు పడ్డారు. ‘నేను చేసే పాత్రల ద్వారా నాలో కోపం పోయింది’ అని చెప్పేవారట కూడా.
తెలుగు సినిమాపై సూర్యకాంతం వేసిన ముద్ర చెరిగిపోనిది. గయ్యాళి పాత్రల్లో ఆమె ఒదిగిపోయిన తీరుకు ఎవరి ఇళ్లలోనైనా ఆడపిల్ల పుడితే.. ‘సూర్యకాంతం’ అనే పేరు పెట్టుకోవడమే మానేశారట. అంతగా ఆమె తన పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. పాత్రల్లోనే కాదు.. ఒక్కోసారి బయట కూడా అంతే కోపంగా వ్యవహరించేవారట. ఓసారి సారథి స్టూడియో కాంటీన్లో సాయంత్రం పకోడి వెయ్యమన్నారు. వారు క్యాంటీన్ వాళ్లు సరే అన్నారు. సాయంత్రమయ్యాక ప్రొడక్షన్ వాళ్లతో.. పకోడీ వేయమన్నాను.. తీసుకురా అని చెప్పారు.
అయితే వాళ్లు బజ్జీ వేయడంతో అదే విషయం ఆమెకు చెప్పారు. ఇంకేముంది.. ఆమెలో తన కోపాన్ని చూపిస్తూ.. క్యాంటీన్ వారిని ఓ ఆట ఆడుకున్నారట. ‘ఉదయం ఎందుకు వేస్తానన్నావ్.. ఇప్పుడెందుకు వేయలేదు. కుదరకపోతే నాకు చెప్పాలి. ఈ బజ్జీలు నేనడగలేదు.. నేను డబ్బు ఇవ్వను.. దిక్కున్నచోట చెప్పుకో అన్నారట. మళ్లీ మాట్లాడితే.. పెద్దవాళ్లతో చెప్పి క్యాంటీన్ ఎత్తించేస్తాను.. అని ఊగిపోయారట. దీంతో క్యాంటీన్ యజమాని సూర్యకాంతంను బతిమాలుకున్నాడట. అలా ఉంటుంది సూర్యాకాంతం గారి ప్రతాపం.
మరో సందర్భంలో ఏఎన్నార్ సినిమాల్లోకి వెళ్లిన కొత్తల్లో తన పాటలు తానే పాడుకునేవారు. అప్పుడు వచ్చిన ‘ముగ్గురు మరాఠీలు’ సినిమాలో ఏయన్నార్, టి.జి కమలాదేవి నటించారు. వీరిద్దరూ కలసి ‘చల్.. చలో వయ్యారీ షికారీ’ అనే డ్యూయెట్, సినిమా ఆరంభంలో వచ్చే ప్రార్థన గీతం ‘జై..జై భైరవ త్రిశూలధారీ’ గీతాన్ని కన్నాంబతో కలిసి ఏయన్నార్, టి.జి కమలాదేవి పాడారు. ఈ బృందగీతం రికార్డింగ్ శోభనాచల థియేటర్లో మధ్యాహ్నం మొదలై సాయంత్రం వరకు జరిగింది. మధ్యలో బ్రేక్ ఇచ్చారు. టిఫిన్, కాఫీలు వచ్చాయి. అప్పటికే సినిమాల్లో కన్నాంబ సీనియర్. దీంతో ఆమెకు మాత్రమే సప్లై చేసేవారు.
ఏయన్నార్, కమలాదేవికి సప్లై చేయలేదు. ఇక జూనియర్ ఆర్టిస్టుల సంగతి సరేసరి. దీంతో ఏయన్నార్కు కోపం వచ్చేసింది. టిఫిన్ అడిగేందుకు ఆత్మాభిమానం అడ్డొచ్చి.. కోపంగా స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోయారట. మద్రాసు వెళ్లిన కొత్తల్లో తాను కొనుక్కున్న ర్యాలీ సైకిల్ వేసుకొని లజ్ రోడ్డు వరకు వెళ్లి తనకు, కమలాదేవికీ కేకులు కొని తెచ్చుకున్నారట..! కుర్రాడికి ఆత్మాభిమానం, పౌరుషం ఎక్కువే అనుకున్నారట. అక్కినేని సుదీర్ఘ ప్రయాణం మొత్తం ఇంతే ఆత్మాభిమానంతో ఉన్నారు కూడా.