సినీ పరిశ్రమను గ్లామర్ ప్రపంచం అంటుంటాం. అయితే, ఆ రంగుల ప్రపంచంలో కొన్ని విషాద గాధలు కూడా వుంటాయి. చాలా మిస్టరీస్ కూడా వుంటాయ్. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ మిస్టరీలు చాలా చాలా ఎక్కువ. అవి అప్పటికప్పుడు సంచలనాలౌతాయ్, కాలక్రమంలో కనుమరుగైపోతాయ్. అందులో కూడా డెత్ మిస్టరీస్ మరీ మరీ ప్రత్యేకం. ఏళ్ళ గడుస్తున్నా.. ఆ మిస్టరీలు వీడవు. ఎందుకిలా.? అదంతే. రంగుల ప్రపంచంలో ఆ చీకటి కోణాల గురించి అక్కడక్కడా సినీ అభిమానుల్లో అప్పుడప్పుడూ చర్చకు వస్తూనే వుంటాయ్. నటిగా ఎంతో భవిష్యత్తు వుందని కొత్త టాలెంట్ విషయమై సినీ ప్రేమికులు అనుకునేలోపు, విగత జీవుల్లా మారిపోయిన కొందరు అందాల భామల డెత్ మిస్టరీల వివరాల్లోకి వెళదామా మరి..
ప్రత్యూషకి ఏమయ్యింది.? ఆమె ఎలా చనిపోయింది.?
తెలుగునాట పెను సంచలనం ప్రత్యూష హత్య. అసలామె ఎలా చనిపోయింది.? అన్నది ఇప్పటికీ తేలలేదు. ఎవరీ ప్రత్యూష.? అంటే, ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘కలుసుకోవాలని’ సినిమాలో హీరో మరదలి పాత్రలో నటించింది. అంతకు ముందు సీనియర్ నటుడు మోహన్ బాబు నటించిన ‘రాయుడు’ సినిమాలోనూ ప్రత్యూష నటించి మెప్పించింది. తేజ దర్శకత్వంలో ఆమె హీరోయిన్ పాత్రలో నటించబోతోందంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రత్యూష హత్యకు గురైంది. ఆమెపై అత్యాచారం చేసి చంపేశారంటూ వార్తలొచ్చాయి. కొందరు రాజకీయ ప్రముఖుల వారసులకు ఈ హత్యతో సంబంధముందంటూ పెద్ద దుమారమే చెలరేగింది. తన కుమార్తె మరణానికి కారణమైనవారిని శిక్షించాలంటూ ప్రత్యూష తల్లి చాలా ఏళ్ళపాటు న్యాయపోరాటం చేసి అలసిపోయారు. ప్రత్యూష గనుక హత్యకు గురవకుండా వుండి వుంటే, తెలుగు సినీ పరిశ్రమకు ఓ టాలెంటెడ్ హీరోయిన్ దొరికి వుండేది.
భార్గవి.. నవ్వించి మాయమైపోయింది..
నేచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అష్టా చెమ్మా’. ఇందులో శ్రీనివాస్ అవసరాలకు జంటగా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.? ఆమె పేరే భార్గవి. ఏమయ్యిందో తెలియదు, భార్గవి మాత్రం హత్యకు గురైంది. ఆమెను ప్రేమించిన వ్యక్తే.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. కానీ, ఎందుకు చంపాడు.? అన్నది ఇప్పటికీ మిస్టరీనే. సినీ రంగంలో వెలిగిపోవాలని కలలుగని, సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన భార్గవి, తన కల నెరవేరకుండానే ఈ లోకం విడిచి వెళ్ళిపోవడం చాలామందికి కంటతడి పెట్టించింది. ‘అష్టా చెమ్మా’ సినిమా ఎప్పుడు టీవీల్లో వచ్చినా, భార్గవి గురించే మాట్లాడుకుంటుంటారు ప్రత్యేకంగా. అదీ ఆమె ఆ సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో వేసిన బలమైన ముద్ర.
జియా ఖాన్.. ఇలా వచ్చి, అలా మాయమైపోయి
బాలీవుడ్ నటి జియా ఖాన్ గుర్తుందా.? అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నిశ్శబ్ద్’ సినిమాలో నటించిందీ భామ. చేసింది చాలా తక్కువ సినిమాలు. ఇంతలోనే ఆమె జీవితం ముగిసిపోయింది. పోలీసు రికార్డుల ప్రకారం ఆమె ఆత్మహత్య చేసుకుంది. కానీ, ఆమెను ఎవరో చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారనే ఆరోపణలున్నాయి. జియా ఖాన్ పార్తీవ దేహంపై గాయాలు.. ఆమెది ఆత్మహత్య కాదు, హత్య.. అనడానికి సాక్ష్యాలంటూ ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే వున్నారు. కానీ, న్యాయం జరగలేదు.
పైన చెప్పుకున్నవి కొన్ని మాత్రమే. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే కనిపిస్తాయి. సినిమా నటుల్ని తారలుగా పోలుస్తుంటాం.. వెండితెరపై మెరిసిపోవాల్సిన కొన్ని తారలు.. చిన్న వయసులోనే దివికేగి.. అక్కడ మెరుస్తుంటాయ్. ఎందుకిలా.? ఇదొక మిస్టరీ. ఈ మిస్టరీలు వీడే అవకాశం చాలా చాలా చాలా తక్కువ.